భారత ఎన్నికల కమిషన్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు AI-జనరేటెడ్ వీడియోలపై కఠిన నిషేధం ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు లేదా ఇంకెవరైనా AI వీడియోలను వాడకూడదని కమిషన్ స్పష్టంగా చెప్పింది.
ఈ నిబంధనల ప్రకారం, ఓటర్లను తప్పుదారి పట్టించడానికి, అసత్య సమాచారం ప్రచారం చేయడానికి AI సాధనాలను ఉపయోగించడం ఉల్లంఘనే అని తెలిపింది. నవంబర్ 6, 11న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది ECI తీసుకున్న నిర్ణయం. రిజల్ట్స్ నవంబర్ 14న వెలువడతాయి.
ECI సూచించిన ప్రకారం, రాజకీయ వ్యాఖ్యానం ప్రధానంగా ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, ప్రజలపై ప్రభావం చూపే విషయాలపై కేంద్రీకరించాలి. వ్యక్తిగత జీవితాలపై వ్యతిరేక వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు చేయకూడదు. AI మాధ్యమాలను తప్పుగా ఉపయోగించడం ఎన్నికల సమగ్రతకు తీవ్ర హానికరమని కమిషన్ హెచ్చరించింది.

