నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి వచ్చిన బెదిరింపు లేఖ కలకలం రేపుతోంది. ఆగస్ట్ 17న ఒక గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకుని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఇంటికి వచ్చి, ఎమ్మెల్యేకు ఇవ్వాలని చెబుతూ భద్రతా సిబ్బందికి లేఖ అందించాడు. ఆ లేఖలో రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని స్పష్టంగా రాయడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే ఈ విషయాన్ని ఎంపీ, ఎమ్మెల్యేకు తెలియజేయగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను పోలీసులు గోప్యంగా విచారిస్తూ, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇస్కపాళెంకు చెందిన వ్యక్తి సహా కొందరిని అనుమానితులుగా గుర్తించి విచారణ చేస్తున్నారు. అలాగే ఎంపీ-ఎమ్మెల్యే ఇళ్ల వద్ద అనుమానాస్పదంగా తిరిగిన యువకుడిని నాలుగు ఫోన్లతో పట్టుకున్నారు. అయితే అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ వచ్చిన విషయం నిజమేనని ధృవీకరించారు. ఈ సంఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

