పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు కొత్త ప్లాన్ వేసింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, జైషే ఇప్పుడు మహిళా ఉగ్రవాద గ్రూప్ ను ఏర్పాటు చేస్తోంది.
జమాతే ఉల్ మామినాత్ పేరుతో ఈ బ్రిగేడ్ను జైషే ఏర్పాటు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ యూనిట్కు జైషే నేత మసూద్ అజహర్ సోదరి సాదియా అజార్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రంలో ఇప్పటికే రిక్రూట్మెంట్ ప్రారంభమైంది.
ఆపరేషన్ సిందూర్లో బహవల్పూర్ కేంద్రం ధ్వంసమవగా, మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దెబ్బ నుంచి బయటపడేందుకు మసూద్, మహిళలను ఉగ్రవాద దారిలోకి తిప్పాలని యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కమాండర్ల భార్యలతోపాటు ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలను కూడా ఈ బ్రిగేడ్లో చేర్చే ప్రణాళికతో ఉన్నారు. గతంలో ఐసిస్, బోకో హరామ్, హమాస్ లాంటి ఉగ్ర ముఠాలు మహిళలను ఆత్మాహుతి దాడుల్లో ఉపయోగించినట్లు తెలిసింది. ఇప్పుడు జైషే కూడా అదే మార్గంలో నడుస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

