ప్రభుత్వంలో ఉన్నప్పుడే కాక, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ పదవుల పంపకం కొనసాగిస్తోంది. గతంలో సీఎం జగన్ ఎన్నో ప్రభుత్వ పదవులు ఇచ్చినా, 2024లో పార్టీకి పెద్దగా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు మాత్రం పార్టీ నిర్మాణంలో మార్పులు చేసి, కొత్త పదవులు సృష్టించి నాయకులకు కేటాయిస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర కార్యదర్శి పదవుల పందేరం మొదలైంది. గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, స్పీకర్ అయ్యన్నపాత్రుడు తమ్ముడు సన్యాసిపాత్రుడు లాంటి వారు ఈ పదవులు పొందారు. వీరికి నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు.
ఇంతవరకు ప్రభుత్వ పదవులు ఆస్వాదించిన వారు పార్టీ కోసం అంతగా కష్టపడలేదనే అభిప్రాయం ఉండటంతో, ఈసారి కష్టపడే వారికి మాత్రమే అవకాశమిస్తామని జగన్ సంకేతాలు ఇచ్చారు. ఇప్పటి పదవులు రేపటి టికెట్లకు పునాది అవుతాయా అనేది ప్రశ్న. మొత్తానికి, పార్టీ బలోపేతం కోసం జగన్ వేసిన ఈ కొత్త ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

