వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్–టీడీపీకి పరోక్ష బంధం ఉందని, రాహుల్ గాంధీ–చంద్రబాబు మధ్య హాట్లైన్ నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ సంధానానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర పోషిస్తున్నారని కూడా అన్నారు. ఏపీలో ఓట్ల దోపిడీపై రాహుల్ గాంధీ మౌనం పాటించడం పట్ల జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఒంటరిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని, కానీ వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. అమరావతిలో అవినీతి, ఇసుక దందాలు వంటి అంశాలపై కూడా ఇతర విపక్షాలు స్పందించడం లేదని మండిపడ్డారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం, విపక్షంలో ఉన్న వైసీపీ ఇతర పార్టీలతో కలసి బలమైన ఉద్యమాలు చేస్తే ప్రజలలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. కానీ విపక్షాలను విమర్శించడం, వారిని దూరం చేయడం వ్యూహాత్మక లోపమని చెబుతున్నారు. అధికార కూటమిలో మూడు పార్టీలు, విపక్షంలో మూడు పార్టీలు ఉన్న పరిస్థితిలో, అందరిని కలుపుకుని పనిచేయడం వైసీపీకి లాభదాయకమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

