అమెరికా పర్యటనలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన అణు బెదిరింపులు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు గురయ్యాయి. భారత్ పాక్పై దాడి చేస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని, తమ వద్ద ఉన్న అణు బాంబులను ఉపయోగించేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలపై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ ఘాటుగా స్పందిస్తూ, మునీర్ను “సూట్ వేసుకున్న ఒసామా బిన్ లాడెన్”గా అభివర్ణించారు. పాకిస్థాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అమెరికా భూభాగంలోనే ఒక దేశ సైన్యాధిపతి ఇలాంటి తీవ్రవాద ధోరణి గల వ్యాఖ్యలు చేయడం అసహనకరమని రూబిన్ అన్నారు. అలాగే, పాక్ అణు ఆయుధాగారం ప్రపంచ భద్రతకు ముప్పుగా మారకుండా “నియంత్రిత క్షీణత” విధానం ద్వారా పర్యవేక్షించాల్సిన అవసరాన్ని సూచించారు. భారత్ కూడా మునీర్ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇవి ప్రాంతీయ శాంతి స్థిరత్వానికి హానికరమని పేర్కొంది.

