తాడిపత్రిలో మళ్లీ రాజకీయ వేడి మొదలైంది.. సుప్రీం కోర్టు అనుమతితో 16 నెలల తర్వాత తన ఇంటికి చేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మళ్లీ పట్టణంలోకి రానీయలేదు. ఈరోజు తాడిపత్రి రావడానికి ప్రయత్నించగా, స్వగ్రామం తిమ్మంపల్లి దగ్గరే అడ్డుకున్నారు.
పోలీసుల వాదన ప్రకారం, పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉంటే మున్సిపల్ అధికారులు చేపట్టిన కొలతల పనులపై వివాదం చెలరేగే అవకాశం ఉందట. పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ స్థలంలో నిర్మించారన్న ఆరోపణలతో అధికారులు కొలతలు తీస్తున్నారు. ఇప్పటికే ఒకసారి కొలతలు వేసినప్పటికీ, ఈరోజు మళ్లీ అదే ప్రక్రియ కొనసాగించడంతో తీవ్రత పెరిగింది.
మాజీ ఎమ్మెల్యే తనను అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు కూడా నిరసనలు చేపట్టారు. మరోవైపు టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి వర్గాల మధ్య పాత వైరం మళ్లీ తెరపైకి రావడంతో తాడిపత్రి రాజకీయాలు మళ్లీ ఉత్కంఠభరితంగా మారాయి. పెద్దారెడ్డి పట్టణ ప్రవేశం నిషేధం, మున్సిపల్ స్థల వివాదం, జేసీ వర్సెస్ కేతిరెడ్డి పోరు – ఇవన్నీ కలిసి తాడిపత్రి రాజకీయాలను మళ్లీ హాట్టాపిక్గా మార్చాయి.

