నేపాల్లో అల్లర్ల కారణంగా చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏపి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 217 మంది ఏపీ వాసులు నేపాల్లో చిక్కుకున్నారని గుర్తించారు. వీరిలో 118 మంది మహిళలు ఉన్నారు. కఠ్మాండూ, హెటౌడా, పోఖ్రా, సిమికోట్ ప్రాంతాల్లో వీరు ఉన్నట్టు సమాచారం.
మంత్రి నారా లోకేశ్ సమీక్ష సమావేశం నిర్వహించి, ఢిల్లీలో 218 సీట్లు ఉన్న ప్రత్యేక ఇండిగో విమానం సిద్ధం చేశారు. ఈ విమానం గురువారం మధ్యాహ్నం కాఠ్మండు నుంచి బయలుదేరి సాయంత్రానికి విశాఖపట్నం, కడప విమానాశ్రయాలకు చేరుకుంటుంది. అక్కడినుంచి ప్రభుత్వం వారిని స్వస్థలాలకు పంపించనుంది.
లోకేశ్ వీడియో కాల్లో బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అందరిని క్షేమంగా వెనక్కి తీసుకువస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి రెండు గంటలకు బాధితుల పరిస్థితిని అధికారులు తెలుసుకుంటున్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖతోనూ, నేపాల్ అధికారులతోనూ సమన్వయం చేస్తూ ఈ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
నేటి సాయంత్రానికి అందరినీ స్వదేశానికి తీసుకొస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

