అనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని అన్నారు. 15 నెలల పాలనలో ఇచ్చిన హామీలను నిలబెట్టామని, సంక్షేమం అంటే కేవలం ఓట్ల కోసం కాదని, ప్రజలపై బాధ్యత అని స్పష్టం చేశారు.
57% మంది ఓటు వేసి, కూటమికి 164 సీట్లు ఇచ్చారని, ప్రతిపక్షానికి హోదా లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. గత ప్రభుత్వం 93 పథకాలను నిలిపివేసి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని ఆరోపించారు. అయితే తాము సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి, సూపర్ హిట్ చేశామని తెలిపారు.
మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ, లక్ష మందికి స్కిల్ శిక్షణతో ఉద్యోగాలు కల్పించడం, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు అందించడం చేశామని అన్నారు. ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 సహాయం అందిస్తామని, ఇప్పటికే 47 లక్షల రైతులకు 3,173 కోట్లు జమ చేశామని తెలిపారు. యూరియా కొరత లేకుండా చూస్తామన్నారు.
మహిళలకు దీపం-2 పథకం కింద ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 1,704 కోట్లు ఖర్చు చేసి 2.45 కోట్ల సిలిండర్లు అందించామన్నారు.
యువత అండగా ఉంటే ఏ కొండనైనా ఢీకొంటానని, 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
మొత్తం మీద, సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభలో సంక్షేమం, అభివృద్ధి, మా ధ్యేయమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

