ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ముగిసిన మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం, ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహణ కొనసాగించాలని నిర్ణయించింది.
గురువారం విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. వచ్చే నెలలో టెట్ నిర్వహించాలి, జనవరిలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, మార్చిలో పరీక్షలుపూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త టీచర్లు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ పోస్టులు లేకుండా నాణ్యమైన బోధన అందించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం. మధ్యతరగతి యువత ఎక్కువగా ఆశించే టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వాలని లోకేష్ స్పష్టం చేశారు.
గత ఐదేళ్లలో డీఎస్సీ జరగక నిరాశ చెందిన నిరుద్యోగులకు ఈ నిర్ణయం కొత్త ఆశ కలిగించింది. మెగా డీఎస్సీని 150 రోజుల్లో పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో డీఎస్సీకి సిద్ధమవ్వడం ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోంది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహణతో టీచర్ ఉద్యోగాల భవిష్యత్తు సుస్థిరమవుతుందనే నమ్మకం పెరిగింది.

