అనంతపురం టిడిపి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. దీనికి అభిమానులు అనంతపురం టిడిపి కార్యాలయాన్ని చుట్టుముట్టి ఫ్లెక్సీలను చించేశారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా స్పందిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆపాలని ప్రయత్నించడం అంటే సూర్యుడిని అరచేతితో ఆపినట్టే అని వ్యాఖ్యానించారు. మంచి సినిమా వస్తే ఎవరూ అడ్డుకోలేరని, బాగాలేకపోతే ఎవరూ ఆడించలేరని స్పష్టం చేశారు. ఉదాహరణగా పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమాను గుర్తుచేశారు. ఎంతగా ప్రచారం చేసినా ఫ్లాప్ అయ్యిందని, పవన్ అభిమానులే చూడలేదని ఆమె అన్నారు. సినిమాలను సినిమాలుగానే చూడాలని, రాజకీయాలను వాటితో మిక్స్ చేయకూడదని రోజా సూచించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరని, ఆయన సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయని రోజా హైలైట్ చేశారు.
అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆపాలని చూడడం వ్యర్థమని, ప్రజలే సినిమా విజయాన్ని నిర్ణయిస్తారని రోజా స్పష్టం చేశారు.

