ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు పూర్తయింది. ఈ కాలంలో దాదాపు 32 కేబినెట్ సమావేశాలు జరిగాయి. అయితే, తాజాగా జరిగిన కేబినెట్ సమావేశం పవన్ కళ్యాణ్ ప్రశ్నలతో హాట్ టాపిక్ అయింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లూలూ గ్రూప్ పెట్టుబడులపై నేరుగా ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రానికి వచ్చే లాభం ఎంత? ఉపాధి అవకాశాలు శాతం ఎంత? స్థానికులకు ప్రయోజనం ఉంటుందా? అంటూ అధికారులను నిలదీశారు. లూలూ వంటి కంపెనీలకు విలువైన భూములు, భారీ రాయితీలు ఇస్తున్నా, ప్రజలకు ఎంత మేలు జరుగుతోందనే ప్రశ్నను ఆయన బలంగా ఎత్తారు.
మేధావులు, ప్రజా సంఘాలు కూడా ఇదే విషయంపై తరచుగా సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. పవన్ ప్రశ్నలు కేవలం లూలూ ప్రాజెక్ట్కే కాకుండా రాష్ట్ర పారిశ్రామిక విధానంపై కూడా ఆలోచన రేపేలా ఉన్నాయి.
అయితే, మంత్రి వర్గ నిర్ణయాలు సమిష్టిగా తీసుకుంటారు. అయినా పవన్ ఈ రీతిగా సందేహాలు వ్యక్తం చేయడం వెనుక వ్యూహం ఏమైనా ఉందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఏది ఏమైనా — ఈసారి పవన్ ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజల అభిప్రాయాలను కేబినెట్ ముందు ఉంచినట్టు తెలుస్తుంది.

