మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే కిరణ్, ఈసారి రాహుల్ తెలివిపై సెటైర్లు వేశారు. ఈసీతో బీజేపీ రిగ్గింగ్ చేసి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రశ్నించారు. 2014లో 282, 2019లో 303 సీట్లు గెలిచిన బీజేపీ, 2024లో నిజంగా రిగ్గింగ్ జరిగి ఉంటే 400 సీట్లు రావాలిగా, 240 వద్ద ఎందుకు ఆగిపోయిందని కౌంటర్ వేశారు. ప్రజల తీర్పు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని, ఒకే రోజు జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీలో తక్కువ, పార్లమెంట్లో ఎక్కువ సీట్లు రావడం సహజమని ఉదాహరణలు ఇచ్చారు. రాహుల్ తన తెలివిని వినియోగించుకోవాలని, లేకపోతే తెలివైన సలహాదారులను పెట్టుకోవాలని సూచించారు. మాజీ కాంగ్రెస్ నేతగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీకి ఊరట కలిగించగా, రాహుల్పై పార్టీ అంతర్గత విమర్శలుగా మారాయి. రాహుల్ గాంధీ చేస్తున్న ఇదంతా పొలిటికల్ డ్రామాగా జనాలకు అర్థమవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

