మాల్దీవులు ప్రపంచంలోనే మొట్టమొదటిగా జెనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ అమలు చేసిన దేశంగా నిలిచింది. నవంబర్ 1 నుంచి ఈ చట్టం అధికారికంగా ప్రారంభమైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రజారోగ్యాన్ని కాపాడడం, పొగాకు రహిత కొత్త తరాన్ని తయారు చేయడం ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యం.
ఈ నిబంధన ప్రకారం 2007 జనవరి 1 తర్వాత జన్మించిన ఎవరైనా వ్యక్తి మాల్దీవుల భూభాగంలో పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు కొనడం, విక్రయించడం నిషేధం. ఉల్లంఘన చేస్తే 50,000 రుఫియా అంటే సుమారు 2.9 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది.
ఈ నిషేధం పర్యాటకులకు కూడా వర్తిస్తుంది. అలాగే, ఎలక్ట్రానిక్ సిగరెట్లు మరియు వేప్లు వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ పూర్తిగా నిషేధించబడ్డాయి. వీటిని ఉపయోగిస్తే 5,000 రుఫియా జరిమానా విధించబడుతుంది.
ఇదే తరహా చట్టాన్ని ముందుగా న్యూజిలాండ్ అమలు చేసినా, అది 2023లో రద్దయింది. బ్రిటన్లో కూడా ఇలాంటి నిషేధం ప్రతిపాదన దశలో ఉంది. కానీ మాల్దీవులు మాత్రం ఈ నిషేధాన్ని విజయవంతంగా అమలు చేసిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది.

