ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా హాజరైన హీరో బాలకృష్ణ పేరు ప్రస్తావన రావడంతో సభలో నవ్వులు పూశాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరుగుతుండగా, సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు బీజేపీ LP నేత విష్ణు కుమార్ రాజు ను మాట్లాడమని ఆహ్వానించారు.
తనకు ఎంత సమయం ఇస్తున్నారో అడిగిన విష్ణుకుమార్ రాజుకు, పది నిమిషాలు మాత్రమే అనడంతో ఆయన చలోక్తి విసిరారు. నా పక్కన ఇంత పెద్ద హీరో కూర్చున్నారు… అది చూసి కూడా పది నిమిషాలేనా? అంటూ బాలయ్య వైపు చూపిస్తూ నవ్వేశారు. దీనికి స్పందించిన రఘురామరాజు, అందుకే పది నిమిషాలు ఇచ్చా… లేదంటే డిప్యూటీ సిఎమ్ పవన్ కల్యాణ్ వచ్చే వరకు మాట్లాడమనే పర్మిషన్ ఇస్తానంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో బాలయ్య కూడా చేతులు ఊపుతూ నవ్వుల్లో పాలుపంచుకున్నారు. సభలోని సభ్యులంతా హాయిగా నవ్వుకున్నారు. రఘురామరాజు, విష్ణుకుమార్ రాజు మధ్య ఉన్న స్నేహం కారణంగా ఈ చలోక్తులు మరింత ఆకర్షణగా మారాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

