ఏపీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుల్లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒకరు. మంగళవారం కోర్టులో తీవ్ర స్థాయిలో ఎమోషనల్ అయ్యారు. చెవిరెడ్డి జైలు జీవితాన్ని తట్టుకోలేక, వెన్నునొప్పితో తీవ్ర బాధ పడుతున్నారని, తక్షణ వైద్య సహాయం అందించాలని ఏడ్చారు. గతంలో ప్రభుత్వానికి, పోలీసులకు వార్నింగ్స్ ఇస్తూ ధైర్యవంతుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు, కోర్టులో కూడా భయంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం స్కాంలో దాదాపు 250 కోట్ల నగదును ఎన్నికల్లో ఖర్చు చేశారంటూ సిట్ ఆరోపణలు చేస్తోంది. చెవిరెడ్డి తనను అన్యాయంగా అరెస్టు చేశారని, మద్యం వ్యాపారంతో సంబంధం లేదని మళ్లీ కోర్టులో చెప్పి, బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. జైలులో తన ఆరోగ్యం సమస్యలు చూపిస్తూ, కోర్టుకు విన్నవించుకున్నారు. న్యాయమూర్తి వేదనను దృష్టిలో ఉంచుకుని కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. చెవిరెడ్డి పిటిషన్ పై ఆ రోజున వాదనలు వినే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో ఇప్పటికే తన పాత్రకు సంబంధించి బలమైన ఆధారాలతో సిట్ తన బెయిల్ అడ్డుకుంటోందని చెబుతున్నారు, దీంతో ఆయన బెయిల్ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలంటూ అనుచరులు అంటున్నారు.

