ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి పట్ల కఠినమైన వైఖరి ఎత్తుకున్నారు. జైలుకి వెళ్ళే వారు ఇకపై పదవుల్లో కొనసాగలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జైలుకి వెళ్ళగానే 50 గంటల్లో ఉద్యోగం ఆటోమేటిక్గా పోతుందని చెప్పారు. అలాంటప్పుడు రాజకీయ నాయకులు జైలు నుంచి పాలించడమెలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. అందుకే 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతో అవినీతి రహిత పాలనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ చట్టం ప్రధానుల నుంచి మంత్రుల వరకు అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
బీహార్లోని గయలో 13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోడీ, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. పరిశ్రమలు బలోపేతం అవుతాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల పేదలకు ఇళ్లు ఇచ్చామని, బీహార్లో 38 లక్షల ఇళ్లు నిర్మించామని గుర్తు చేశారు. బీహార్ నుండి తీసుకున్న ప్రతిజ్ఞతో ఉగ్రవాదంపై దేశం గట్టి చర్యలు తీసుకుందని ప్రస్తావించారు. రైల్వే అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమల పెరుగుదలతో బీహార్ వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. మొత్తానికి, అవినీతి వ్యతిరేకతతో పాటు అభివృద్ధి హామీలతో మోడీ ఎన్నికల ప్రచారాన్ని బీహార్ నుంచే ప్రారంభించారు.

