కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీడియా ముందుంచి, ముఖ్యంగా కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను ఎండగట్టారు. బీజేపీ అభ్యర్థికి లక్షకు పైగా మెజారిటీ రావడం అనుమానాస్పదమని, ఒకే వ్యక్తి పేరు మీద వేలాది ఓట్లు, ఒకే డోర్ నెంబర్ కింద లక్షల ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. శకున్ రాణి అనే ఓటరు రెండు సార్లు ఓటు వేసిందన్న ఉదాహరణను కూడా చూపించారు. అయితే, కర్ణాటక ఎన్నికల అధికారి ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఆ మహిళ ఒక్కసారి మాత్రమే ఓటు వేసిందని, రాహుల్ చూపించిన జాబితా తమది కాదని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై స్పష్టమైన ఆధారాలను సమర్పించాలని కోరుతూ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. ఇక ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ తదుపరి చర్యలేంటో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.

