టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లోనే ఆసుపత్రికి 21 ఎకరాల భూమి కేటాయించారని, 2019లో శంకుస్థాపన కూడా చేసినట్టు చెప్పారు. అయితే, జగన్ ప్రభుత్వం రాగానే అమరావతి అభివృద్ధిని అడ్డుకుని, తమ నిర్మాణ పనులు నిలిపివేసిందని ఆరోపించారు. “అప్పట్లో జగన్ సహకరించి ఉంటే, ఇప్పటికి పేదలకు ఉచితంగా వైద్యం అందుబాటులో ఉండేది” అని బాలకృష్ణ విమర్శించారు. ఆసుపత్రి పూర్తిగా విరాళాల ద్వారానే నడుస్తుందని, వైద్యులు కూడా ఉచిత సేవలు అందిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం కక్షతో వ్యవహరించిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రావడంతో పనులు వేగంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి ఆసుపత్రి సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక వేశామని స్పష్టం చేశారు. బసవతారకం ఆసుపత్రి ద్వారా పేదలకు రూపాయి ఖర్చు లేకుండా సేవ చేయడం తమ కుటుంబ లక్ష్యమని బాలకృష్ణ అన్నారు. తల్లి బసవతారకం కోరికను నెరవేర్చడం కోసం ఈ ప్రాజెక్టును ఏ పరిస్థితుల్లోనూ ఆపేది లేదని హామీ ఇచ్చారు.

