కడప జిల్లాలో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం తాడేపల్లిలో అభ్యర్థులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, అధికార టీడీపీ నేతలు బందిపోట్లలా ఓట్లు దొంగిలించారని, పోలీసులు వారికి తోడ్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తెచ్చి, ఒక్కో ఓటరికి ఒక్కో రౌడీని పెట్టి బెదిరింపులు చేశారని విమర్శించారు. పలువురు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గ్రామాల్లో తిష్ట వేసి బెదిరింపులు, దాడులు జరిపారని, పోలింగ్ ఏజెంట్లను తరిమి పంపి పత్రాలు చింపేశారని తెలిపారు. వెబ్కాస్టింగ్, సీసీ పుటేజీని బయటపెట్టే ధైర్యం ఉందా అని చంద్రబాబును సవాల్ చేశారు. గ్రామాల మధ్య పోలింగ్ బూత్లను మారుస్తూ దొంగ ఓట్లు వేయించారని, ఇందుకు ఫోటో సాక్ష్యాలను చూపించారు. రాష్ట్ర చరిత్రలో ఇంత హింసాత్మక ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని, ఇది అడ్డగోలు రాజకీయం, రాక్షస పాలన అని తీవ్రంగా విమర్శించారు. రీ పోలింగ్లో కూడా దొంగ ఓట్లు వేస్తున్నారని, మహిళా ఏజెంట్లపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

