ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ ఆలోచనల నుంచి పుట్టిన విలేజ్ క్లినిక్స్ పథకాన్ని ఆయన హయాంలో అమలు చేయలేకపోయారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గ్రామాల్లో ప్రజలకు సులభంగా వైద్యం అందించాలన్న ఉద్దేశంతో 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది.. ఇందుకోసం సుమారు 1,200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి, కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలని భావిస్తోంది.
జగన్ హయాంలో ఈ పథకంపై చర్చలు జరిగినా ఎన్నికల కారణంగా అమలు కాలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తెచ్చిన ఈ నిర్ణయం వల్ల ప్రజలకు వైద్య సౌకర్యాలు చేరువ అవుతాయని అందరూ ఆశపడుతున్నారు. అయితే, జగన్ ఆలోచనలను అనుసరించడం వల్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వస్తాయో అని కూటమి నేతల్లో చర్చ మొదలైంది. తల్లికి వందనం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలు ఇచ్చింది, ఇప్పుడు విలేజ్ క్లినిక్స్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రజలకు మేలు చేసే ఆలోచన ఎవరిదైనా ప్రజల మంచికే కదా అని అధికార వర్గాల వాదన.

