మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు వైసీపీ మద్దతు పలకడాన్ని ఆమె ఆక్షేపిస్తూ.. వైసీపీ అసలు రంగు మరోసారి బయటపడింది, జగన్ బీజేపీ B-T లా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడని ఆరోపించిన షర్మిల.. టీడీపీ, జనసేన, వైసీపీ మూడు కలిసి బీజేపీకి తోడుగా పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. బాబు, జగన్, పవన్.. ముగ్గురూ మోదీకి తొత్తులు అంటూ షర్మిల విమర్శించారు. అవినీతి కేసుల భయంతోనే జగన్ బీజేపీకి దాసోహం అయ్యారని ఆమె దుయ్యబట్టారు.
ఇక ప్రతిపక్షాలు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టగా, తెలుగు బిడ్డకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ కోరినా వైసీపీ ముందుగానే ఎన్డీఏ పక్షాన నిలిచిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలుగు ప్రజలతో చేసిన ద్రోహమని అన్నారు. సెప్టెంబర్ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్ష అభ్యర్థి గెలుపు ఖాయమేనని అంటున్నప్పటికీ, కాంగ్రెస్ తెలుగు సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

