దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు అధికారికంగా ముగిసింది. 2007లో జరిగిన ఈ దారుణ ఘటనపై దాదాపు 17 ఏళ్ల పాటు విచారణ కొనసాగినా, అసలు నిందితుడు ఎవరో తేల్చలేక కేసు క్లోజ్ అయింది. విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ తుది ఉత్తర్వులు జారీ చేస్తూ కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు 2019లో సీబీఐ దర్యాప్తు చేపట్టి పలు కోణాల్లో విచారణ జరిపింది. మృతదేహ అవశేషాలతో రీ-పోస్టుమార్టం చేయించినా, కొత్త ఆధారాలు దొరకలేదని సీబీఐ తుది నివేదికలో స్పష్టం చేసింది. గతంలో నిందితుడిగా నిలిచిన సత్యంబాబు పై సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు కొట్టివేసిన విషయం గుర్తు చేసింది. కేసు ముగియడంతో ఆయేషా తల్లిదండ్రులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. రీ-పోస్టుమార్టం కోసం తీసుకున్న కుమార్తె శరీర అవశేషాలను తమకు అప్పగించాలని కోర్టును కోరగా, ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అధికారికంగా అప్పగించాలని కోర్టు ఆదేశించింది. తెనాలిలో మతాచార ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులకు సూచనలు జారీ చేసింది.
దోషి తేలకుండానే ముగిసిన ఈ కేసు, న్యాయం కోసం ఎదురు చూసిన కుటుంబానికి మిగిల్చింది మాత్రం అంతులేని వేదనే.

